జగిత్యాలలో బావిలోకి దూసుకెళ్లిన కారు.. యువకుడు మృతి
జగిత్యాలలో బావిలోకి దూసుకెళ్లిన కారు.. యువకుడు మృతి
జగిత్యాల, జూన్ 1: జగిత్యాల జిల్లా రూరల్ మండలం మోరపల్లి–తాటిపల్లి బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోరపల్లి శివారులో వేగంగా వెళ్తున్న టాటా కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న బావిలోకి దూసుకెళ్లింది.
ప్రమాద సమయంలో కారులో ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడగా, మరో యువకుడు బావిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బావిలో గల్లంతైన వ్యక్తిని దాసరి అరుణ్గా గుర్తించారు. ప్రమాదంలో చిక్కుకున్న కారు బావిలోనే ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లతో పోలీసులు కారును బయటకు తీశారు. అనంతరం కారులోనే అరుణ్ మృతదేహం లభ్యమైంది.
మృతుడు దాసరి అరుణ్తో పాటు కారులో ఉన్న ముగ్గురు యువకులు జగిత్యాల పట్టణానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అతివేగం లేదా డ్రైవింగ్లో నిర్లక్ష్యం కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపగా, యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Post a Comment