బెంగళూరుకు వెళ్తున్న APSRTC సూపర్ లగ్జరీ బస్సుకు ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కర్నూలు-1 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై తీవ్ర విషాదం నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నుంచి బెంగళూరుకు బయలుదేరిన APSRTC సూపర్ లగ్జరీ బస్సు మంగళవారం తెల్లవారుజామున బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-44)పై చిక్బళ్లాపూర్ జిల్లా దొడ్డపైలగుర్కి సమీపంలో ప్రమాదానికి గురైంది. ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బస్సు వేగంగా లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, క్యాబిన్ లారీ వెనుక భాగంలోకి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ లక్ష్మణ్ (52), బెంగళూరులోని కల్యాణ్ నగర్కు చెందిన ప్రయాణికుడు ఉమాకాంత్ రావు (77) అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆసుపత్రులకు తరలించబడ్డారు. వారి పరిస్థితిపై వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించి గాయపడిన వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పెరేసంద్ర పోలీసులు, అత్యవసర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లారీ కింద ఇరుక్కుపోయిన బస్సు క్యాబిన్లో డ్రైవర్ మృతదేహం చిక్కుకుపోవడంతో భారీ క్రేన్ సహాయంతో శకలాలను తొలగించి బయటకు తీశారు. మరో మృతుడు ఉమాకాంత్ రావు మృతదేహాన్ని కిటికీ ద్వారా వెలికితీశారు.
ఈ ప్రమాదంతో బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన బస్సు, లారీని రహదారి నుంచి తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఓవర్టేకింగ్ ప్రయత్నమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Post a Comment