ఫిర్యాదుదారుడికి న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలి: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
ఫిర్యాదుదారుడికి న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలి: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత
వరంగల్, జూలై 8: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుదారుడికి న్యాయం జరుగుతుందనే విశ్వాసం కల్పించడం పోలీసుల బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.
బుధవారం వెస్ట్జోన్ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్ను కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పూల మొక్కను అందజేసి ఆమెకు స్వాగతం పలికారు.
అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, కార్యాలయ నిర్వహణ, అధికారులు, సిబ్బంది పనితీరును కమిషనర్ పరిశీలించారు. స్టేషన్కు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేసి, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, గ్రామాల పరిస్థితులు, శాంతిభద్రతలపై స్టేషన్ ఇన్స్పెక్టర్ వేణును అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో మాట్లాడుతూ, ప్రజల కోసం పనిచేస్తున్నామనే బాధ్యతతో ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. స్టేషన్కు వచ్చిన ప్రతి ఫిర్యాదును స్వీకరించి, తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని ఆదేశించారు.
అలాగే, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలను పోలీస్ స్టేషన్లో అనవసరంగా ఎక్కువసేపు వేచి ఉండే పరిస్థితి రాకుండా చూడాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ ఎన్. శ్వేత పోలీస్ అధికారులకు సూచించారు. ఈ తనిఖీ సందర్భంగా ప్రజలకు మరింత పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పోలీసింగ్ అందించడంపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Post a Comment