మానవాళి మార్గదర్శి మానవ జీవిత మర్మాన్ని తెలిపే ఖురాన్ అవతరించిన రంజాన్ మాసం
మానవాళి మార్గదర్శి మానవ జీవిత మర్మాన్ని తెలిపే ఖురాన్ అవతరించిన మాసం రంజాన్ మాసం. జమాతే ఇస్లామి హింద్ అధ్యక్షుడు షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, రంజాన్ మాసం విశిష్టతను వివరించారు.
సృష్టికి సృష్టికర్త ఎవరో తెలుపుతూ, మానవ జీవిత మర్మాన్ని తెలియజేసే పవిత్ర ఖురాన్ గ్రంథం ఈ నెలలో అవతరించిందని ఆయన చెప్పారు. పవిత్ర శుక్రవారం సందర్భంగా చుంచుపల్లి మండలం, రుద్రంపూర్ గ్రామంలోని "మస్జీద్-ఏ-ఖుబా" లో జరిగిన ప్రత్యేక ఉపన్యాసంలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, ఈ జీవితం శాశ్వతం కాదని, మనకు లభించిన హోదా, ధనం, సంతానం, జ్ఞానం అన్నీ పరీక్షల కోసం మాత్రమేనని చెప్పారు. ఇవన్నీ సాటి మానవుల హితం కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సకల చెడులకు దూరంగా ఉండి, కపటం, ద్వేషం, ప్రకోపం, కల్మషం లేని మానవతా విలువలు కలిగిన వ్యక్తిగా మారడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు.
అదే విధంగా, మనందరికీ దేవుడు ఒక్కడేనని, పరస్పరం మనం సోదరులమని ఆయన గుర్తు చేశారు. సాటి వారికి కష్టం, నష్టం కలిగించకుండా జీవించడమే నిజమైన దైవభక్తి అని పేర్కొన్నారు. ఖురాన్ మానవులందరి కోసం అవతరించిందని, దాని బోధనలను పాటించడం ద్వారా ఇహపరాల సాఫల్యాన్ని పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మస్జీద్ ఇమామ్ మౌలానా మజహర్, మస్జీద్ అధ్యక్షుడు అజీజ్ ఖాన్, సోనూ, అజహర్, షబ్బీర్, షమీం, షాకీర్, సలీం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment