-->

సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరికతో ఆందోళన ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ

సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరికతో ఆందోళన ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ


కాంగ్రెస్ పార్టీ అగ్రనేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురవడం దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానుల్లో తీవ్ర ఆందోళనను రేపుతోంది. ఆమె ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని శిమ్లాలో ఉన్న ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

వాస్తవానికి మూడు రోజుల క్రితమే ఆమె ఆసుపత్రిలో చేరారు. అయితే ఈ విషయం మంగళవారం ఉదయం మాత్రమే వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు అధికారిక ప్రకటన చేయలేదు. సోనియా గాంధీకి ఏ రకమైన అనారోగ్యం తలెత్తిందనే అంశం కూడా ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

గతంలోనూ ఆమెకి కొన్ని సార్లు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురయ్యాయి. ఇటీవల న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో కడుపునొప్పి కారణంగా చికిత్స తీసుకున్నారు. ఆరోగ్య పరీక్షల అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు. కానీ ఇప్పుడు తిరిగి ఆసుపత్రిలో చేరడం పార్టీ వర్గాలలో కలవరపాటుకు దారి తీసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పలువురు సీనియర్ నేతలు ఆమె ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు. శిమ్లాలోనే ఓ ప్రైవేట్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆమె అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

సోనియా ఆరోగ్యంపై పార్టీ అధికార ప్రతినిధులు స్పందించే అవకాశముండగా, అభిమానులు ఆమె సత్వర కోలుకోని రాజకీయంగా మరింత యథావిధిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు.

Blogger ఆధారితం.