-->

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం


హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపీనాథ్ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 59 సంవత్సరాలు. ఈ వార్త తెలిసిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లో ఆయన అనుచరులు, పార్టీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గోపీనాథ్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ, గోపీనాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ – "గోపీనాథ్ రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీతో ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలాగే హైదరాబాద్ అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు" అని గుర్తు చేశారు.

2014 ఎన్నికల్లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్, ఆ తర్వాత 2018లోను విజయం సాధించి మరోసారి ప్రజలకు సేవ చేశారు. తన నిబద్ధత, వినయంతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న నాయకుడిగా చంద్రబాబు అభివర్ణించారు. మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన సేవలు అపూర్వమని, తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు.

గోపీనాథ్ ఆకస్మిక మరణంతో తెలుగు రాజకీయ వేదిక ఒక నిబద్ధతగల నేతను కోల్పోయిందని పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆయన అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Blogger ఆధారితం.