పార్టీ అభివృద్ధికి నిరంతరం కష్టపడతా: నాగా సీతారాములు
హైదరాబాద్, గాంధీభవన్ లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇటీవల నియమితులైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నియామక పత్రం అందుకున్న నాగా సీతారాములు మాట్లాడుతూ, "తనపై నమ్మకంతో పార్టీ ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తాను. పార్టీ బలోపేతం కోసం అందరినీ కలుపుకుని ముందుకు సాగతాను" అన్నారు. గత మూడేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలోని తన ప్రయాణాన్ని గుర్తుచేసిన ఆయన, విద్యార్థి సంఘం నుంచీ ఉద్యమాల వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, అయితే పార్టీపై నమ్మకం ఎప్పటికీ తగ్గలేదన్నారు.
ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ స్థాయిలకు ఆశావహుడిగా ఉన్నప్పటికీ, టికెట్ రాకపోయినా పార్టీ మారకుండా, కట్టుబాటు తోనే ప్రచారం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పార్టీ అధిష్టానం తాను చేసిన పనిని గుర్తించి, ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిందని చెప్పారు. "కష్టపడితే పార్టీ గుర్తించి, సరైన స్థానం కల్పిస్తుందనే నిదర్శనం నేనే" అని సీతారాములు అన్నారు.
పార్టీని మహా వృక్షంగా అభివర్ణించిన ఆయన, దాని నీడలో పనిచేసే ప్రతి కార్యకర్త అభివృద్ధి చెందుతాడని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీ విజయమే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేశారు.
తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురామరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిలకు నాగా సీతారాములు కృతజ్ఞతలు తెలిపారు.
Post a Comment