-->

మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణస్వీకారం

 

మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణస్వీకారం

15కు చేరిన మంత్రుల సంఖ్య.. కేబినెట్‌లో మరో 3 ఖాళీలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆదివారం రాజ్‌భవన్‌లో నూతన మంత్రులుగా ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమక్షంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 12:22 గంటల వరకు జరగ్గా, మొదటగా గడ్డం వివేక్ ఇంగ్లీష్‌లో, అనంతరం అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి తెలుగులో ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులకు శుభాకాంక్షలు తెలిపి బొకేలు అందించారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇప్పటికే ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులుతోపాటు కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ మహేశ్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి, పాయల్ శంకర్, హరీశ్ బాబు తదితరులు హాజరయ్యారు.

ప్రత్యేకంగా నూతన మంత్రుల కుటుంబ సభ్యులు, నియోజకవర్గాల కీలక నేతలు కూడా కార్యక్రమానికి తరలివచ్చారు. అనంతరం రాజ్‌భవన్‌లోని లాన్‌లో గవర్నర్‌తో కలిసి ముఖ్యమంత్రి, మంత్రులంతా గ్రూప్ ఫొటో దిగారు.

మొత్తం 18 మందికి అవకాశం.. ఇంకా మూడుపై ఖాళీ

తెలంగాణలో 2023 డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా 11 మంది మంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మొత్తం 12 మంది మంత్రులతో కేబినెట్ కొనసాగుతుండగా, తాజాగా ముగ్గురిని చేర్చడంతో మొత్తం మంత్రుల సంఖ్య 15కి చేరింది. రాష్ట్ర కేబినెట్‌లో మొత్తం 18 మందికి అవకాశం ఉండగా, ఇప్పటికీ మూడు మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి.

ఈ విస్తరణలో సామాజిక న్యాయాన్ని సమతుల్యం చేయడానికే ప్రయత్నించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలో మిగిలిన ఖాళీలను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Blogger ఆధారితం.