-->

తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం – రోడ్డుపై తెగిపడిన బస్సు డ్రైవర్‌ తల

తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం – రోడ్డుపై తెగిపడిన బస్సు డ్రైవర్‌ తల


మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మాచారం వద్ద శుక్రవారం (ఆగస్టు 15) తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో మాచారం బ్రిడ్జిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వోల్వో ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.

కడప నుంచి హైదరాబాద్‌కు 35 మంది ప్రయాణికులతో వస్తున్న వోల్వో బస్సు లారీని బలంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం తీవ్రతకు బస్సు డ్రైవర్ తల తెగి లారీపై పడింది. డ్రైవర్ వెనుక కూర్చున్న లక్ష్మీదేవి (65), ఆమె కోడలు రాధిక (45) అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కుటుంబ సమేతంగా కడపలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది.

ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా, అందులో సుమారు 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది మృతదేహాలను బస్సు శకలాల నుంచి బయటకు తీశారు. బస్సు, లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారి 44పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రొక్లెయిన్ సాయంతో వాహనాలను పక్కకు జరిపి ట్రాఫిక్‌ను సవ్యంగా కొనసాగించారు.

ప్రాథమిక దర్యాప్తులో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.