-->

హత్యాయత్నం కేసులో నలుగురికి జైలు శిక్ష, జరిమానా

హత్యాయత్నం కేసులో నలుగురికి జైలు శిక్ష, జరిమానా


కొత్తగూడెం లీగల్, హత్యాయత్నం కేసులో నలుగురికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ కొత్తగూడెం ఫస్ట్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కే. కిరణ్‌కుమార్ మంగళవారం తీర్పు వెల్లడించారు.

కేసు వివరాలు:
బూర్గంపాడు మండలం సార్పాక గ్రామానికి చెందిన తాళ్లూరి భారతి 2019 ఫిబ్రవరి 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త జగదీశ్వర్‌రావు, మరిది సర్వేశ్వరరావు తమ భూమిలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లగా, ఇరవెండి గ్రామానికి చెందిన సున్నం ముత్తయ్య, సున్నం తులసమ్మ, సున్నం గోపాలకృష్ణ @ గోపాల్, అలాగే అశ్వాపురం మండలం చింతిర్యాలకు చెందిన కొమరం అంజయ్య, ఇతర కుటుంబ సభ్యులు కత్తులు, గొడ్డలులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గ్రామస్తులు భూఖ్య బాలాజీ, భూక్య జక్రి, బాధావతు బాలకృష్ణ, దారావత్ సురేష్ ఈ ఘటనను ప్రత్యక్షంగా చూశారని విచారణలో తేలింది. గాయపడిన వారిని వెంటనే బూర్గంపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం కోర్టుకు చార్జ్‌షీట్ సమర్పించారు.

ఈ కేసులో సున్నం అజయ్ మైనర్ కావడంతో అతనిపై వేరుగా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. కాగా, మరో నిందితుడు సున్నం చెంచయ్య విచారణలో ఉండగానే మరణించడంతో అతనిపై కేసు మూసివేశారు.

కోర్టు తీర్పు:
కోర్టు వాదోపవాదాలు విని, 14 మంది సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా సున్నం ముత్తయ్య, సున్నం తులసమ్మ, సున్నం గోపాలకృష్ణ @ గోపాల్, కొమరం అంజయ్యలకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, ప్రతి ఒక్కరికి రూ.2,000 జరిమానా విధించింది.

ఈ కేసు ప్రాసిక్యూషన్‌ను ఏపీపీ కె. రాజారావు నిర్వహించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ డి. రాఘవయ్య, లైజన్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, డ్యూటీ ఆఫీసర్ పిసి జే. సురేష్ సహకరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793