ఫలించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం ఫలించింది. రాష్ట్రానికి యూరియా సరఫరా కల్పించాలని పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టిన ఎంపీల డిమాండ్కు కేంద్రం చివరికి సానుకూలంగా స్పందించింది.
ఈ వారంలోనే తెలంగాణకు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేందుకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా షిప్మెంట్ ప్రారంభమైంది. మరో మూడు షిప్మెంట్ల ద్వారా యూరియా సరఫరా జరిగేలా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు ఆదేశాలు జారీ అయ్యాయి.
యూరియా కొరతపై గళమెత్తిన తెలంగాణ ఎంపీల ధైర్యసాహసాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. "రైతు కష్టాలను దేశానికి వినిపించిన ఎంపీల పోరాటం ఫలితాన్నిస్తోంది. రైతాంగం కోసం పోరాడే కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది" అని మంత్రి పేర్కొన్నారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడమే తెలంగాణ రైతులు ఇబ్బందులు పడటానికి కారణమని మంత్రి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థం కోసం కుట్రలు చేసే ప్రతిపక్షాలపై రైతులు ఆలోచించాలన్నారు.
"రైతాంగ శ్రేయస్సే ప్రథమ కర్తవ్యం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ రైతులకు అండగా నిలుస్తుంది" అని తుమ్మల స్పష్టం చేశారు.

Post a Comment