బ్రేకింగ్ న్యూస్: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
హనుమకొండ: తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్ర విషాదానికి దారితీసింది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది.
గురువారం ఉదయం శంకర్ గౌడ్ తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆయనను తొలుత వరంగల్లో చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలని వైద్యులు సూచించారు.
ఈ క్రమంలో అంబులెన్స్లో హైదరాబాద్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే శంకర్ గౌడ్ మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 80 శాతం వరకు కాలిన గాయాలు కావడంతో ప్రాణాలు నిలవలేకపోయినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని హైదరాబాద్లోని కంచన్బాగ్ డీఆర్డీఓ ఆసుపత్రిలో ఉంచినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో, శంకర్ గౌడ్ మృతి పరిస్థితులను మరింత క్లిష్టం చేసే అవకాశం ఉంది.
ఇక ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీ రేపు చర్చలు జరపనుందని తెలిపింది. అయితే ఈ చర్చలకు కార్మిక సంఘాలు హాజరవుతాయా? లేక మరింత ఆందోళన కార్యక్రమాలను ప్రకటిస్తాయా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Post a Comment