ఓఆర్ఆర్పై దారుణం: ఆగి ఉన్న కారులో మంటలు… వ్యక్తి సజీవదహనం
మేడ్చల్ జిల్లా, శామీర్పేట: సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. శామీర్పేట ఓఆర్ఆర్ రోడ్డుపై పక్కన నిలిపి ఉంచిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
కారులో ప్రయాణం… అకస్మాత్తుగా మంటలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం జైగిరి గ్రామానికి చెందిన తల్లపల్లి దుర్గాప్రసాద్ (34) మీడియా రంగంలో పనిచేస్తూ ఓ టీవీ చానెల్ నడుపుతున్నారు. పని నిమిత్తం ఆదివారం రాత్రి టీఎస్ 03 ఎఫ్డీ 7688 నంబరు గల ఫోర్డ్ ఇకో స్పోర్ట్స్ కారులో హైదరాబాద్ నగరానికి వచ్చారు.
రాత్రి మియాపూర్లోని బంధువుల ఇంట్లో ఉండి, ఉదయం సుమారు 4:30 గంటలకు ఓఆర్ఆర్ ద్వారా స్వగ్రామానికి బయల్దేరారు. శామీర్పేట పరిధిలోకి రాగానే కారును రోడ్డు పక్కన ఆపిన కొద్దిసేపటికే, కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.
సజీవదహనం
మంటలు వేగంగా మొత్తం కారును చుట్టుముట్టడంతో, దుర్గాప్రసాద్ బయటకు రాలేకపోయారు. స్థానికులు, ప్రయాణికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ టీమ్, పోలీసులు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే దుర్గాప్రసాద్ పూర్తిగా కాలిపోయి అస్థిపంజరంగా మారినట్లు అధికారులు నిర్ధారించారు.

Post a Comment