ఈ నెల 12న ‘భాల భరోసా’, ‘ప్రణామం’ పథకాల ప్రారంభం
తెలంగాణ, జనవరి 10: దివ్యాంగులు, వృద్ధులు, చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. సమాజంలో అత్యంత సంరక్షణ అవసరమైన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘భాల భరోసా’ మరియు ‘ప్రణామం’ పథకాలను ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ రెండు పథకాలు రాష్ట్రంలో దివ్యాంగుల సాధికారత, వృద్ధుల సంరక్షణ, చిన్నారుల ఆరోగ్య భద్రతకు బలమైన భరోసా ఇవ్వనున్నాయి. సంక్షేమం మాత్రమే కాకుండా, ఆత్మగౌరవంతో కూడిన జీవనానికి ఈ పథకాలు దోహదపడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దివ్యాంగుల సాధికారతకు రూ.50 కోట్ల కేటాయింపు
దివ్యాంగుల సామాజిక, ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా రూ.43.22 కోట్ల విలువైన సహాయక పరికరాలను రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మంది అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
లబ్ధిదారులకు అందించనున్న పరికరాల్లో
- రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు
- బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు
- వీల్ చైర్లు
- ల్యాప్టాప్లు
- వినికిడి యంత్రాలు
- మొబైల్ ఫోన్లు
‘ప్రణామం’ – వృద్ధుల కోసం మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లు
వృద్ధుల మానసిక ఉల్లాసం, భద్రత, సంరక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన ‘ప్రణామం’ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
- హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, హన్మకొండ జిల్లాల్లో రెండేసి కేంద్రాలు
- మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసే ఈ కేంద్రాల్లో వృద్ధులకు
- లైబ్రరీ సదుపాయం
- ఇండోర్ గేమ్స్
- టీవీ
- ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్లు
- విశ్రాంతి కోసం ప్రత్యేక వసతులు
చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు ‘బాల భరోసా’
ఐదేళ్ల లోపు చిన్నారుల్లో వైకల్యాలను ముందుగానే గుర్తించి, సమయానికి వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘బాల భరోసా’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.
ఈ పథకం కింద
- అంగన్వాడీ టీచర్లు ప్రాథమిక స్క్రీనింగ్ నిర్వహిస్తారు
- వైకల్య లక్షణాలు ఉన్న పిల్లలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ఆర్బీఎస్కే ద్వారా వైద్య పరీక్షలకు పంపిస్తారు
- అవసరమైన పిల్లలకు ఉచిత శస్త్రచికిత్సలు, థెరపీ, పునరావాస సేవలు అందిస్తారు
ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో శాశ్వత వైకల్యాలు నివారించి, ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. ‘వైకల్య రహిత తెలంగాణ’ నిర్మాణమే బాల భరోసా పథకం లక్ష్యం అని ప్రభుత్వం వెల్లడించింది.
సంక్షేమ రాష్ట్ర దిశగా తెలంగాణ
భాల భరోసా, ప్రణామం పథకాల ప్రారంభంతో తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పాలనలో మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు, భద్రత, గౌరవవంతమైన జీవితం కల్పించడమే ఈ పథకాల సారాంశమని అధికారులు తెలిపారు.

Post a Comment