ఈసారి తెలంగాణ శకటానికి ఢిల్లీలో అవకాశం లేదు
న్యూఢిల్లీ, జనవరి 23: ఢిల్లీలోని కర్తవ్యపథ్పై నిర్వహించే రిపబ్లిక్ డే శకటాల ప్రదర్శనలో ఈసారి తెలంగాణకు చోటు దక్కలేదు. రాష్ట్రాల ఔన్నత్యం, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించే ఈ వేడుకలో తెలంగాణ శకటాన్ని సెర్మోనియల్ కమిటీ రెండో రౌండ్లోనే తిరస్కరించింది. దీంతో తెలంగాణకు నిరాశ తప్పలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2026 వరకు మొత్తం 13 ఏండ్లలో కేవలం మూడు సార్లే రాష్ట్ర శకటానికి అవకాశం లభించడం గమనార్హం. తొలిసారి 2015లో ‘బోనాలు’ థీమ్తో తెలంగాణ శకటం కర్తవ్యపథ్పై మెరిసింది. ఆ తర్వాత 2020లో బతుకమ్మ, వేయి స్తంభాల ఆలయం, మేడారం సమ్మక్క–సారక్క జాతరలను ప్రతిబింబించే థీమ్తో మరోసారి ప్రదర్శించారు.
అయితే 2025లో తెలంగాణ శకటానికి అవకాశం రాలేదు. ఎర్రకోటలో నిర్వహించిన భారత్ పర్వ్లో మాత్రం రాణి రుద్రమదేవి, రామప్ప దేవాలయం థీమ్తో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించే అవకాశం కల్పించారు. ఈసారి కూడా సెర్మోనియల్ కమిటీ రెండో దశలోనే తెలంగాణ శకటాన్ని తిరస్కరించింది. గమనార్హంగా, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు కూడా ఈసారి అవకాశం దక్కలేదు.
77వ రిపబ్లిక్ డే పరేడ్లో 30 శకటాల ప్రదర్శన
ఢిల్లీలో జరగనున్న 77వ రిపబ్లిక్ డే పరేడ్లో ఈసారి మొత్తం 30 శకటాలను ప్రదర్శించనున్నారు. వీటిలో 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలు, అలాగే కేంద్ర ప్రభుత్వ విభాగాలు మరియు త్రివిధ దళాలకు చెందిన 13 శకటాలు ఉన్నాయి.
‘స్వతంత్రత కా మంత్రం: వందేమాతరం – సమృద్ధి కా మంత్రం: ఆత్మనిర్భర భారత్’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది శకటాల ప్రదర్శన జరగనుందని కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది.
ఈసారి అస్సాం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల శకటాలు ప్రదర్శించనున్నారు. అలాగే భారత వైమానిక దళం, సైన్యం, నౌకాదళ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Post a Comment