నకిలీ తుపాకీతో బెదిరించి గోల్డ్ షాపులో దొంగతనానికి యత్నం
యజమాని అప్రమత్తతతో తప్పిన ప్రమాదం నిందితుడి కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్, జనవరి 03: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం సత్యనారాయణ కాలనీలో దొంగతన యత్నం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ గోల్డ్ షాపులోకి ప్రవేశించిన ఓ దుండగుడు నకిలీ తుపాకీతో షాపు యజమానిని బెదిరించి బంగారం దోచుకునేందుకు యత్నించాడు.
శుక్రవారం మధ్యాహ్నం సమయంలో షాపులోకి వచ్చిన దుండగుడు ఒక్కసారిగా తుపాకీ చూపిస్తూ యజమానిని భయపెట్టాడు. అయితే తుపాకీ నకిలీదని గ్రహించిన షాపు యజమాని అప్రమత్తతతో స్పందించి, ధైర్యంగా ఎదిరించడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. యజమాని చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న కీసర పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. షాపులో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడి వయసు, దుస్తుల వివరాల ఆధారంగా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని పోలీసులు తెలిపారు. అలాగే వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ ఘటనతో నాగారం పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Post a Comment