బాలికపై అత్యాచారం, ఇద్దరు యువకులు అరెస్ట్
మహబూబ్నగర్/హన్వాడ, మే 3: మహబూబ్నగర్ జిల్లాలోని హన్వాడ మండల పరిధిలో మైనర్ ప్రేమ జంటను బెదిరించి బాలికపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్లు ప్రేమలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వారు హన్వాడ మండలం పిల్లిగుండు తండా సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న అడవి ప్రాంతానికి వెళ్లారు.
అక్కడ వారిని గమనించిన మహబూబ్నగర్కు చెందిన అశోక్, లక్ష్మణ్ అనే ఇద్దరు యువకులు ప్రేమ జంటను బెదిరించారు. మొదట రూ.6 వేల నగదును దోచుకున్న వారు, అనంతరం ప్రియుడిని బెదిరించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాలుడు వెంటనే పోలీసులకు 100కు కాల్ చేయడంతో అధికారులు స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని స్థానికులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Post a Comment