మహిళా సంఘాలకు సౌర విద్యుత్ ప్లాంట్లు
మే 25: తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మరింత సాధికారత సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా “మహిళా వారోత్సవాలు” నిర్వహిస్తోంది.
“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా గ్రామీణ మహిళల స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వాములుగా చేస్తూ సోమవారం వికారాబాద్, మధిర ప్రాంతాల్లో మహిళా సమాఖ్యలకు మంజూరైన సౌర విద్యుత్ ప్లాంట్లను ప్రభుత్వం ప్రారంభించింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,000 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాలకు కేటాయించగా, తొలి దశలో 6 మెగావాట్ల ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది.
ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాల సభ్యులే చేపట్టనున్నారు. ఉత్పత్తి చేసిన విద్యుత్ను విక్రయించడం ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయం లభించనుండగా, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇది కొత్త దారులు చూపనుందని ప్రభుత్వం భావిస్తోంది.

Post a Comment