-->

సైబర్ క్రైమ్ కేసులో లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడ్డ పోలీసు ఇన్‌స్పెక్టర్

సైబర్ క్రైమ్ కేసులో లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడ్డ పోలీసు ఇన్‌స్పెక్టర్

హైదరాబాద్, మే 30: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)లో పనిచేస్తున్న పోలీసు ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్ అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కాడు. అధికారిక విధుల్లో సహాయం చేయడానికి లంచం డిమాండ్ చేసి స్వీకరించిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.

ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక సైబర్ మోసం కేసులో ఫిర్యాదుదారుడి కుటుంబ సభ్యులు, స్నేహితులను కేసులో ఇరికించకుండా ఉండేందుకు ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్ రూ.9 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఈ డిమాండ్‌లో భాగంగా ఇప్పటికే ఫిర్యాదుదారుడి నుంచి రూ.5 లక్షలు నగదు రూపంలో స్వీకరించినట్లు ఏసీబీ గుర్తించింది.

అనంతరం మిగిలిన రూ.4 లక్షల లంచం కోసం ఇన్‌స్పెక్టర్ మరోసారి ఫిర్యాదుదారుడిని బెదిరిస్తూ తన కార్యాలయానికి పిలిపించి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ సమాచారం మేరకు ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (CIU) అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి, శుక్రవారం ఆయన కార్యాలయంలోనే అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అనంతరం ఇన్‌స్పెక్టర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కల్లో చూపని రూ.13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఆస్తులపై మరింత విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

ఈ కేసులో బత్తుల మహేందర్‌ను అరెస్ట్ చేసి, నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు ఏసీబీ తెలిపింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు పేర్కొంది.

లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ ఉద్యోగులు లేదా అధికారులు లంచం డిమాండ్ చేసిన సందర్భాల్లో ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ 9440446106, ఫేస్‌బుక్‌లో Telangana ACB, ఎక్స్ (ట్విటర్)లో @TelanganaACB ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ స్పష్టం చేసింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793