ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు లారీ డ్రైవర్లు సజీవ దహనం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేకల తండా శివారులో మంగళవారం ఉదయం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకలవ్య నర్సరీ సమీపంలోని వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
స్థానికుల కథనం ప్రకారం, ఒక లారీ ఆలుగడ్డ లోడుతో వస్తుండగా మరో లారీ బొగ్గు లోడుతో వెళ్తోంది. ఈ క్రమంలో రెండు వాహనాలు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో రెండు లారీల డ్రైవర్లు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు.
ఈ ఘటనలో ఇద్దరు క్లీనర్లు స్వల్ప గాయాలతో బయటపడగా, స్థానికులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని తీవ్రంగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రమాదం కారణంగా వరంగల్–ఖమ్మం ప్రధాన రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో పాటు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Post a Comment