45 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ఎంపీడీవో, ఎంపీవో, ప్రైవేట్ వ్యక్తి
45 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ఎంపీడీవో, ఎంపీవో, ప్రైవేట్ వ్యక్తి
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల ఎంపీడీవో పెనుగొండ రాధిక, ఎంపీవో కె. యాకయ్య, అలాగే ప్రైవేట్ వ్యక్తి సి. నాగార్జునలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏసీబీ వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుడికి అధికారిక అనుకూల చర్య చేపట్టేందుకు నిందితులు లంచం డిమాండ్ చేశారు. పదమటిగూడెం గ్రామంలో లేఅవుట్ అభివృద్ధి పనుల కోసం ఫిర్యాదుదారుడి భూమిలో 15.75 శాతం భాగాన్ని గ్రామపంచాయతీకి భద్రతగా తనఖా పెట్టే ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శికి సూచనలు జారీ చేయడానికి లంచం కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఎంపీడీవో పెనుగొండ రాధిక రూ.20,000, ఎంపీవో కె. యాకయ్య రూ.25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎంపీడీవో తన కుమారుడు, డ్రైవర్గా పనిచేస్తున్న సి. నాగార్జున ద్వారా లంచం స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులను నర్సింహులపేట ఎంపీడీవో కార్యాలయంలోనే పట్టుకున్నట్లు తెలిపారు.
అంతకుముందు కూడా ఇదే పనికి సంబంధించి ఎంపీడీవో రూ.30,000, ఎంపీవో రూ.25,000 చొప్పున లంచం తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని ఏసీబీ పేర్కొంది.
లంచంగా తీసుకున్న నగదును ఎంపీవో యాకయ్య, నాగార్జున వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. విధులను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందినందుకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వరంగల్లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను వెల్లడించలేదు.
లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదుల కోసం ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అధికారులు సూచించారు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్) ద్వారా కూడా ఏసీబీ తెలంగాణను సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ స్పష్టం చేసింది.

Post a Comment