చీరతో చేతులు కట్టేసి.. కత్తితో నరికి భర్తను హత్య చేసిన భార్య
చీరతో చేతులు కట్టేసి.. కత్తితో నరికి భర్తను హత్య చేసిన భార్య
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం బస్వాయపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య తన భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మృతుడు నాగేశ్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య కవిత మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానించిన నాగేశ్ పలుమార్లు ఆమెను మందలించాడు. ఈ విషయమై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
సోమవారం తెల్లవారుజామున పిల్లలు నిద్రిస్తున్న సమయంలో నాగేశ్ చేతులను చీరతో కట్టేసిన కవిత.. అనంతరం కత్తితో మెడ, తలపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
దాడి సమయంలో చిన్న కుమారుడు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, నాగేశ్ రక్తపు మడుగులో పడి కనిపించాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఘటనపై పోలీసులు కవితపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలు, ఇతర కోణాలపై విచారణ కొనసాగుతోంది.

Post a Comment