నీట్ పేపర్ లీక్పై ప్రధానికి సీజేపీ బహిరంగ లేఖ
నీట్ పేపర్ లీక్పై ప్రధానికి సీజేపీ బహిరంగ లేఖ.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్
న్యూఢిల్లీ, జూన్ 19: నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు.
నీట్ పేపర్ లీక్ ఘటనల నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, అనిశ్చితి కారణంగా గత వారం రోజుల్లో 11 మంది నీట్ అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషాద ఘటనల పట్ల కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
అభిజీత్ దీప్కే తన లేఖలో పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల విశ్వాసాన్ని పునరుద్ధరించే విధంగా పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న జాతీయ స్థాయి పరీక్షల్లో భద్రతా ప్రమాణాలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. NEET వంటి కీలక పరీక్షల విశ్వసనీయతను కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు.

Post a Comment