కరెంట్ షాక్తో లైన్ ఇన్స్పెక్టర్ మృతి.. లైన్మెన్కు తీవ్ర గాయాలు
కరెంట్ షాక్తో లైన్ ఇన్స్పెక్టర్ మృతి.. లైన్మెన్కు తీవ్ర గాయాలు
మీటర్ రీడింగ్ తీస్తుండగా విషాదం.. అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ
అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో విద్యుత్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. మీటర్ రీడింగ్ తీస్తున్న సమయంలో కరెంట్ షాక్ తగలడంతో లైన్ ఇన్స్పెక్టర్ మృతి చెందగా, లైన్మెన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో విద్యుత్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది.
సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్ సబ్స్టేషన్లో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న భరత్ (51), లైన్మెన్ రాందాస్ సోమవారం పీగ్లిపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 12 వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్కు మీటర్ రీడింగ్ తీసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరికీ ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది.
ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన రాందాస్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితిపై వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై మృతుడు భరత్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు. మీటర్ బిల్లింగ్ బాధ్యతలు అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నిర్వహించాల్సి ఉండగా, వాటిని లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్తో చేయించారని, అదే ప్రమాదానికి దారితీసిందని వారు పేర్కొన్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అబ్దుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. మృతుడి కుటుంబానికి విద్యుత్ శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటనకు గల అసలు కారణాలపై విచారణ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Post a Comment