కేసీఆర్ కుటుంబంలో విషాదం.. బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు కన్నుమూత
కేసీఆర్ కుటుంబంలో విషాదం.. బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు కన్నుమూత
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేసీఆర్ సతీమణి శోభ సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మేనమామ అయిన జోగినపల్లి శ్రీనివాసరావు గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
శ్రీనివాసరావు మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, బీఆర్ఎస్ నాయకులు యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహాన్ని సుచిత్రలోని నివాసానికి తరలించారు. ఆయన కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు సమాచారం. కుమారుడు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాల నుంచి తెలుస్తోంది.
కేటీఆర్, హరీశ్రావు నివాళి
జోగినపల్లి శ్రీనివాసరావు మృతి వార్త తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని సుచిత్రలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. శ్రీనివాసరావు పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకుని సంతాపం తెలిపారు.
కామారెడ్డి ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన శ్రీనివాసరావు
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సమయంలో జోగినపల్లి శ్రీనివాసరావు అక్కడే ఉండి ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కుటుంబంతో సన్నిహితంగా ఉండే ఆయన మృతి కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నేతలను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
ఇటీవల కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మృతి చెందగా, తాజాగా బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు కన్నుమూయడంతో కేసీఆర్ కుటుంబంలో వరుస విషాదాలు నెలకొన్నాయి.

Post a Comment