-->

గ్రామ పంచాయతీలకు రూపాయి ఇచ్చారా? ఎమ్మెల్యే తన్నీరు

గ్రామ పంచాయతీలకు రూపాయి ఇచ్చారా? ఎమ్మెల్యే తన్నీరు

*గ్రామ పంచాయతీలకు రూపాయి ఇచ్చారా? ఎమ్మెల్యే తన్నీరు

*సిద్దిపేట : గ్రామ పంచాయతీల్లో సఫాయి కార్మికులకు ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు.*

గురువారం సిద్దిపేట జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్‌ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ అధ్యక్షతన సిద్దిపేటలో జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్‌ మనుచౌదరి, అడిషనల్‌ కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌, యాదవరెడ్డి, రఘోత్తంరెడ్డి, అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. సఫాయి కార్మికుల జీతాలు, రైతులకు షరతులు లేకుండా రైతు భరోసాను విడుదల చేయాలని సభలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదం తెలిపారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామపంచాయతీలకు రూపాయి నిధులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వడంతో గ్రామపంచాయతీల ట్రాక్టర్ల ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించారని గుర్తు చేశారు. సఖి సెంటర్‌ ఉద్యోగులకు 7 నెలల నుంచి జీతాలు రావట్లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులకు పంట పెట్టుబడి సాయం సాగుకు ముందు వేస్తారా..? పంట కోతకు వచ్చిన తరువాత వేస్తారా..? అని అధికారులను ప్రశ్నించారు. మధ్యాహ్నభోజన కార్మికులకు ఏడు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇంట్లో ఇద్దరికి పెన్షన్‌ ఇస్తామని చెప్పి.. ఇవ్వకపోగా, రెండు నెలల పెన్షన్‌ పెండింగ్‌లో ఉందని మండిపడ్డారు. కరెంట్‌ సరిగా ఉండడం లేదని విద్యుత్‌ శాఖ అధికారులను హరీశ్‌రావు నిలదీశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, మంత్రులు వస్తే స్వాగతిస్తామని ..కానీ, వాళ్ల పేర్లు చెప్పి పనులు ప్రారంభించ వద్దంటే ఎమ్మెల్యేలుగా మేం ఎందుకు అని ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ప్రొటోకాల్‌ సమస్య ఇక ముందు ఉత్పన్నమైతే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

రైతు రుణమాఫీకి క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. జడ్పీ సర్వసభ్య సమావేశం ముగింపునకు ఆయన హాజరై మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధిగా ఐదేండ్లు పూర్తి చేసుకున్న ఎంపీపీలు, జడ్పీటీసీలకు శుభాకాంక్షలు తెలిపారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని సూచించారు. 

జిల్లా మంత్రిగా సిద్దిపేట జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు ప్రభాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డిలు జడ్పీ చైర్‌పర్సన్‌ రోజా రాధాకృష్ణశర్మతో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలను సత్కరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793