కులంపేరు తప్పుగా నమోదు చేయిస్తే క్రిమినల్ చర్యలు బీసీ కమిషన్ చైర్మన్
కులంపేరు తప్పుగా నమోదు చేయిస్తే క్రిమినల్ చర్యలు బీసీ కమిషన్ చైర్మన్
కరీంనగర్: కులగణన సర్వే సందర్భంగా కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. కులగణన బృహత్తర కార్యక్రమమని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంగర్లో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో నిరంజన్ మాట్లాడారు.
‘‘జనాభాలో బీసీలు 52 శాతం ఉన్నామని ఇప్పటిదాకా చెప్పుకొంటున్నాం. అది నిరూపించుకునేందుకు ఈ సర్వే కీలకం. ఈ గణన ద్వారా బీసీలతో పాటు అన్ని కులాల జనాభా లెక్కలు, వారి ఆర్థిక స్థితిగతులు తెలుస్తాయి. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా మా దృష్టికి వచ్చిన విషయాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. కులగణన జరుగుతున్న సమయంలో కుల సంఘాలు కీలక పాత్ర పోషించాలి. సర్వే సక్రమంగా జరిగేలా చూడాలి. 80వేల నుంచి 90వేల మంది ఎన్యుమరేటర్లు జనగణనలో పాల్గొంటారు. ఎవరూ దీన్ని రాజకీయం చేయొద్దు. అపోహలు, ఆటంకాలు సృష్టించడం మంచిది కాదు.
న్యాయస్థానం పట్ల గౌరవం ఉంది. కోర్టు సూచించినట్టే ముందుకు వెళ్తాం. న్యాయనిపుణల సలహా మేరకు ఈనెల 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగిస్తాం. ప్రజాభిప్రాయ సేకరణలో చాలా రకాల విజ్ఞప్తులు వస్తున్నాయి. కొన్ని కులాల పేర్లు ఎప్పుడూ విననివి కూడా మా దృష్టికి వస్తున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా అందరు సహకరించాలి. అనాథలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి’’ అని నిరంజన్ తెలిపారు.

Post a Comment