కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు – ఈసారి రాములమ్మకు అవకాశం
హైదరాబాద్, తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు రావాల్సి ఉండగా, అందులో ఒక స్థానాన్ని మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించింది. మిగతా మూడు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది.
ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మూడు కీలక పేర్లు
కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థులు:
- అద్దంకి దయాకర్
- విజయశాంతి (రాములమ్మ)
- శంకర్ నాయక్
ఈ ఎంపికలో ఒక స్థానాన్ని ఎస్సీ అభ్యర్థికి, మరొకదాన్ని ఎస్టీ అభ్యర్థికి, మూడో స్థానాన్ని మహిళకు కేటాయిస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
ఎంపికకు కసరత్తు చేసిన కాంగ్రెస్ నాయకత్వం
ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపిక కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అంతేకాకుండా, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను చూస్తున్న ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ ఆధ్వర్యంలో రాష్ట్ర నేతలు జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే అభ్యర్థుల తుది ఎంపిక జరిగింది.
నిజమైన నమ్మకస్తులకే అవకాశం
గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి లేదా కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో ఉన్న వారికి కాకుండా, పార్టీకి నిబద్ధతతో పనిచేసిన వారికే అవకాశమివ్వాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా విజయశాంతికి (రాములమ్మ) ఎమ్మెల్సీ అవకాశం కల్పించడంతో ఆమె మద్దతుదారుల్లో ఆనందం నెలకొంది.
కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుతో ఎన్నికల రణరంగానికి రంగం సిద్ధమైంది.

Post a Comment