సీతారామ సాగునీటి కోసం బీఆర్ఎస్ ఉద్యమ సిద్ధం – జూన్ 30న పూసుగూడెం వద్ద భారీ నిరసన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు తగినంత సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసనకు సిద్ధమైంది. జూన్ 30న ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "భద్రాద్రి జిల్లా రైతులకు ముందుగా సాగునీరు అందించాకే ఇతర ప్రాంతాలకు తరలించాలి" అని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినప్పటికీ, ఇప్పటి వరకు ఒక్క ఎకరా భూమికైనా సాగునీరు అందకపోవడం శోచనీయం అని విమర్శించారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో పూసుగూడెం వద్ద జూన్ 30న ఉదయం 11 గంటలకు “కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండప్రదానం” పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు.
అంతేకాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకాటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భద్రాద్రి రైతుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
"ప్రాజెక్టును హెలికాప్టర్ షో లా ప్రారంభించి, సరిగ్గా అమలు చేయకపోవడం వల్లనే భద్రాద్రి జిల్లా రైతులు మోసపోతున్నారు. ఇది చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వానికి నిదర్శనం. ప్రభుత్వ మొండి వైఖరి మారకపోతే, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన మరింత ఉధృతంగా పోరాటం చేస్తుంది," అని కాపు సీతాలక్ష్మి హెచ్చరించారు.
జూన్ 30న జరగనున్న ఈ నిరసన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Post a Comment