-->

ద్విచక్ర వాహనాలతో రెండు హెల్మెట్లు తప్పనిసరి…!!

ద్విచక్ర వాహనాలతో రెండు హెల్మెట్లు తప్పనిసరి…!!


తయారీదారులకు కేంద్రం మోటార్ వాహనాల ముసాయిదా నిబంధనలు విడుదల
త్రిచక్ర వాహనాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం తప్పనిసరి

న్యూఢిల్లీ, దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు గాను కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మోటార్ వాహనాల నిబంధనలలో రెండు ముఖ్యమైన సవరణలతో కూడిన ముసాయిదాను తాజాగా విడుదల చేసింది. ఈ ముసాయిదా ప్రకారం, కొత్తగా తయారయ్యే ప్రతి ద్విచక్ర వాహనంతో పాటు ఒకటి కాదు, ఏకంగా రెండు హెల్మెట్లు తప్పనిసరిగా సరఫరా చేయాల్సి ఉంటుంది.

ఈ హెల్మెట్లు భారత ప్రమాణాల సంస్థ (ISI) ప్రమాణాలతో ఉండాలి. వాహన తయారీదారులే కొనుగోలుదారులకు ఈ హెల్మెట్లను అందించాలి. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడో నెల నుంచి ఈ ఆదేశాలు బలవంతంగా అమలవుతాయి.

ఇక త్రిచక్ర వాహనాలపై కూడా కీలక మార్పు తీసుకొచ్చారు. వచ్చే సంవత్సరం 2026 జనవరి 1 నుంచి తయారయ్యే అన్ని త్రిచక్ర వాహనాల్లో ‘యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం’ (Anti-lock Braking System - ABS) అమర్చాలని ప్రతిపాదించారు. ఈ వ్యవస్థ ISI 14664:2010 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది.

ఈ రెండు సవరణలపై ప్రజలు, నిపుణులు, వాహన తయారీదారులు తమ అభిప్రాయాలు, సూచనలు పంపవచ్చని కేంద్ర రహదారి, రవాణా శాఖ పేర్కొంది. ఈ మేరకు 30 రోజుల్లోపు అభిప్రాయాలను comments-morth@gov.in అనే మెయిల్‌ ఐడీకి పంపాలని సూచించింది.

ప్రమాద నివారణకు దోహదపడే ఈ చర్యలు రవాణా భద్రతలో నూతన మైలురాయి కావొచ్చని నిపుణుల అభిప్రాయం.

Blogger ఆధారితం.