జూలై 9న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి – సింగరేణి కార్మిక సంఘాల పిలుపు
గోదావరిఖని, జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించబోయే సార్వత్రిక సమ్మెను ఘనంగా జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నేత ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ కార్మికులకు పిలుపునిచ్చారు. గోదావరిఖనిలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సమ్మెకు కార్మికవర్గం నుండి అన్నిరంగాల సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా బొగ్గు పరిశ్రమ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
సమ్మె ప్రధాన డిమాండ్లు:
కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోయే నలుగురు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలి. ఇవి కార్మిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరించరాదు, అలాగే కాంట్రాక్టీకరణ విధానం విస్తరించకూడదని స్పష్టం చేశారు.
కమర్షియల్ మైనింగ్ను పూర్తిగా రద్దు చేసి, బొగ్గు పరిశ్రమను ప్రభుత్వ నియంత్రణలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. సింగరేణికి కొత్త బ్లాకులను తక్షణమే కేటాయించాలి, తద్వారా ఉద్యోగ భద్రత మరియు ఉత్పత్తి కొనసాగుతుందని పేర్కొన్నారు.
పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి, దీని వల్ల ప్రభుత్వ రంగ కంపెనీలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. కోల్ ఇండియాకు చెందిన బొగ్గు పరిశ్రమను విడగొట్టే ఆలోచనను తక్షణమే విరమించాలి. ఇది సంస్థల అంతర్భాగాన్ని దెబ్బతీసే నిర్ణయమని విమర్శించారు.
గ్రాడ్యుటి పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచి, దానిని 2017 జనవరి 1 నుండి వర్తించేటట్లు చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ ద్వారా నిశ్చయించిన వేతనాలను అమలు చేయాలి.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించరాదు – దీనివల్ల లక్షలాది కార్మికుల జీవనాధారం దెబ్బతింటుందని వెల్లడించారు. సమ్మె విజయవంతం కావడమే కార్మిక హక్కుల రక్షణకు బలమైన సందేశమవుతుందని ఖాజీ ఇస్మాయిల్ పేర్కొన్నారు. కార్మికవర్గం ఐక్యతతో పోరాటం చేస్తేనే శ్రమిక హక్కులు నిలబడతాయన్నారు.
Post a Comment