సామాజిక న్యాయం అంటే ముస్లింలను మినహాయించడమేనా..?
కేబినెట్లో ముస్లిం నాయకత్వానికి తలుపులెందుకు మూసేస్తున్నారు..?
– తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేర్ అలీ ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేర్ అలీ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
“సామాజిక న్యాయం చేస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం అసలైన మైనారిటీ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టిన తీరును ఏవిధంగా సమర్థించాలి?” అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ జపం చేస్తూ మంత్రి పదవులను పంచుతున్నారు కానీ బీసీ ముస్లింలకు మాత్రం చులకన వైఖరిని ప్రదర్శించారన్నారు.
ముస్లిం నాయకుల పట్ల న్యాయంగా లేదు: షేర్ అలీ
కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో తోడుగా నిలిచిన ముస్లిం నాయకులుగా రియాజ్, షబ్బీర్ అలీ పేర్లు పేర్కొంటూ...
- రియాజ్ వరంగల్ నుండి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నిబద్ధతతో పనిచేశారు
- షబ్బీర్ అలీ గెలిచే స్థానం అయిన కామారెడ్డిను ముఖ్యమంత్రి రేవంత్కు వదిలి నిజామాబాద్ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు
ఈ ఇద్దరికి మంత్రిపదవులు లభిస్తాయని ఆశించాం కానీ… వాటి స్థానంలో నామినేటెడ్ పదవులతో మాయమాటలతో నిలదీసారు. ఇది మైనారిటీలను రాజకీయంగా ఎదగనివ్వాలనే కుట్రలో భాగమేనని షేర్ అలీ మండిపడ్డారు.
కేంద్ర బీజేపీ విధానాలే కాంగ్రెస్ లోనూ..?
“ఇది బీజేపీ కేంద్రంలో అనుసరిస్తున్న విధానం కాదు కానీ తెలంగాణలో అదే విధానాన్ని కాంగ్రెస్ నాయకత్వం అమలు చేస్తోందా?” అని ప్రశ్నించిన షేర్ అలీ, పార్టీ కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మహేష్ గౌడ్ లు ఈ వ్యవహారంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
హెచ్చరించిన షేర్ అలీ: మైనారిటీల నిర్లక్ష్యం కాంగ్రెస్కు చేటు
తెలంగాణలో ముస్లింలు, మైనారిటీలు కాంగ్రెస్ పార్టీకి శక్తిగా నిలిచారని, ఇప్పుడు వారిని నిర్లక్ష్యం చేస్తే 2029కి పార్టీకి దారుణ ఫలితాలే ఎదురవుతాయని హెచ్చరించారు. “ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టే ఇక్కడ కూడా మైనారిటీ వర్గం దూరమైతే.. పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. కుల, మతాలకు అతీతంగా సామాజిక న్యాయం జరగాలి” అని పేర్కొన్నారు.
ముస్లింల ఆత్మగౌరవాన్ని, నమ్మకాన్ని తాకట్టు పెట్టే చర్యలతో కాంగ్రెస్కు మంగళమే అని చివరగా వ్యాఖ్యానించారు. “వివేకంతో స్పందించకపోతే ముస్లింల ఆగ్రహ ప్రవాహం ఎవరినీ వదిలిపెట్టదు” అని షేర్ అలీ గట్టి హెచ్చరిక చేశారు.
Post a Comment