మహా న్యూస్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించిన జమాతే ఇస్లామీ హింద్ నేతలు
న్యాయబద్ధంగా సమస్యల పరిష్కారం జరగాలని పిలుపు
హైదరాబాద్, మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై ఇటీవల చోటు చేసుకున్న దాడిని జమాతే ఇస్లామీ హింద్ (JIH) నాయకులు తీవ్రంగా ఖండించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అమానుష చర్య అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు.
జమాతే ఇస్లామీ హింద్ వైస్ ప్రెసిడెంట్, ప్రముఖ జాతీయ నాయకులు ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ, టెమ్రీస్ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్, మాజీ మైనారిటీ కమిషన్ ఛైర్మన్ ముజ్తబా ఫరూక్ లు ఒక సంయుక్త ప్రకటనలో స్పందించారు.
వారు ఈ ఘటనపై మాట్లాడుతూ, “మీడియా సంస్థలపై దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగించే చర్యలు. ఇలాంటి చర్యలతో సమస్యలు పరిష్కారమవు. ఎవరికైనా అభ్యంతరాలు, అన్యాయ అనుభూతి ఉంటే, చట్టబద్ధ మార్గంలో కోర్టులు, పోలీస్ స్టేషన్లు వంటి న్యాయ వ్యవస్థలను ఆశ్రయించాలి. చర్చల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నించాలి. కానీ హింసకు తావులేదు,” అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వారు సమాజంలోని ప్రతి ఒక్కరిని శాంతి, సహన బాటలో నడవాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. మీడియా సంస్థలు ప్రజల హక్కులను, సమాచారాన్ని సమాజానికి చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వారు గుర్తు చేశారు.
ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Post a Comment