-->

మాజీ ప్రధాని పీవీకి ఘన నివాళి… ఉచిత కంటి పరీక్షల క్యాంప్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

మాజీ ప్రధాని పీవీకి ఘన నివాళి… ఉచిత కంటి పరీక్షల క్యాంప్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్


హైదరాబాద్, భారతరత్న, మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు 104వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పీవీ జ్ఞానభూమిని సందర్శించి, పీవీ కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకుంటూ పీవీ దేశానికి చేసిన అపూర్వమైన కృషిని ప్రశంసించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "పీవీ నరసింహారావు దేశ అభివృద్ధికి గణనీయంగా తోడ్పడ్డ నేత. విద్యా రంగంలో నవోదయ పాఠశాలలు, గురుకులాల స్థాపన వంటి ప్రగతిశీల చర్యల ద్వారా సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆర్థికరంగంలో తన విప్లవాత్మక సంస్కరణలతో దేశాన్ని ఆత్మనిర్భరంగా మార్చే దిశగా అడుగులు వేసారు," అని వ్యాఖ్యానించారు.

పీవీ స్వగ్రామమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగరలో స్మారకవనం నిర్మాణానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్టు మంత్రి వెల్లడించారు. "వచ్చే ఏడాది జయంతి నాటికి మెమోరియల్ సెంటర్‌, మ్యూజియం సహా అన్ని మౌలిక వసతులు పూర్తి చేస్తాం," అని హామీ ఇచ్చారు.

మాజీ ప్రధాని పీవీతో తమ గురువు చొక్కారావుకు సన్నిహిత సంబంధం ఉందని గుర్తు చేసిన మంత్రి, "చిన్న స్థాయి నుండి దేశ ప్రధానిగా ఎదిగిన అరుదైన నాయకుడు పీవీ. నేటి యువతకు ఆయన జీవితం ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. ఆయన పాలనలో అమలు చేసిన విద్యా, ఆర్థిక రంగ సంస్కరణలు దేశ దిశను మార్చేశాయి," అని పేర్కొన్నారు.

నివాళుల కార్యక్రమానంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచిత కంటి పరీక్షల (ఐ-స్క్రీనింగ్) శిబిరాన్ని ప్రారంభించారు. ఈ క్యాంప్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ కళ్ల ఆరోగ్యాన్ని పరీక్షించించుకున్నారు. పీవీ జయంతిని పురస్కరించుకొని ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడిందని నిర్వాహకులు తెలిపారు.

Blogger ఆధారితం.