హమ్మయ్య..! ఇక పిల్లల ఆధార్ అప్డేట్ కోసం క్యూలలో కాచాల్సిన పని లేదు
న్యూఢిల్లీ: పిల్లల ఆధార్ అప్డేట్ ప్రక్రియను తేలికపరిచేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లోనే బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ అప్డేట్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.
దేశవ్యాప్తంగా సుమారు ఏడు కోట్ల మందికిపైగా పిల్లలు తమ వేలిముద్రలు ఆధార్ కార్డుల కోసం ఇవ్వాల్సిన అవసరం ఉన్నందున, UIDAI పాఠశాలలకు బయోమెట్రిక్ యంత్రాలను పంపించాలని యోచిస్తోంది. రెండు నెలలలోగా ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. అనంతరం దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.
ప్రస్తుతం ఐదేళ్ల లోపు చిన్నారులకు బయోమెట్రిక్ తీసుకోకుండా ఆధార్ జారీ చేస్తారు. ఐదేళ్ల తర్వాత తప్పనిసరిగా ఫింగర్ ప్రింట్ ద్వారా అప్డేట్ చేయాలి. 7 ఏళ్లలోపు ఉచితంగా, తర్వాత రూ.100 ఫీజుతో ఈ సేవలు అందిస్తారు. లేకపోతే వారి ఆధార్ నిలిపివేతకు UIDAI సిద్ధమవుతోంది.
పాఠశాలల్లో ప్రవేశాలు, ఉపకారవేతనాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) వంటి పథకాలకోసం ఆధార్ అవసరమైన నేపథ్యంలో, ఈ కొత్త పథకం తల్లిదండ్రులకు చాలా ఉపశమనం కలిగించనుందని UIDAI సీఈవో భువనేశ్ కుమార్ వెల్లడించారు.
Post a Comment