ఫేక్ అటెండెన్స్పై కఠిన చర్యలు 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
హైదరాబాద్, ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ఉద్యోగుల హాజరును నమోదు చేయించే ప్రక్రియలో ఫేక్ అటెండెన్స్లు పెరుగుతుండటంతో పంచాయతీరాజ్ శాఖ కఠినంగా స్పందించింది. పాత ఫొటోలు అప్లోడ్ చేసి తప్పుదారి పట్టిస్తున్న 15 మంది పంచాయతీ కార్యదర్శులను శాఖ సస్పెండ్ చేసింది. మరో 47 మంది ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించారు.
ఈ వ్యవహారంపై మంత్రి ధనసరి సీతక్క తీవ్రంగా స్పందించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ మన్నించబోమని ఆమె హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో అనుమానాస్పదంగా 553 మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పదిమందితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15 మందిని సస్పెండ్ చేశారు.
ఇటీవల ఓ పంచాయతీ కార్యదర్శి ఫేస్ రికగ్నిషన్ యాప్లో సీఎం రేవంత్రెడ్డి ఫొటో అప్లోడ్ చేయడం వైరల్ కావడంతో ఈ అంశంపై శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక విచారణ చేపట్టారు. తద్వారా వెలుగులోకి వచ్చిన అక్రమాలపై కఠిన చర్యలు చేపట్టారు.
Post a Comment