కాకతీయ థర్మల్ ప్రాజెక్టులో ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి ఘన నివాళి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్లో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (KTPP) సర్వీస్ బిల్డింగ్ 3వ అంతస్తులో తెలంగాణ ఉద్యమానికి మేధస్సు మరియు ప్రాణం పెట్టిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 91వ జయంతి వేడుకలు గౌరవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి చీఫ్ ఇంజనీర్ ఓం & ఎం విభాగానికి చెందిన *చిట్టాప్రగడ శ్రీ ప్రకాష్* అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జయశంకర్ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సమర్పణాత్మకతను, ఉద్యమ పటిమను ప్రశంసిస్తూ చిట్టాప్రగడ మాట్లాడుతూ “జయశంకర్ 1934, ఆగస్టు 6న వరంగల్ జిల్లాలోని అక్కంపేట గ్రామంలో జన్మించారు. తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకితం చేసిన ఆయన నిజమైన ప్రజానాయకుడు. నాన్ ముల్కీ ఉద్యమం నుంచి 1969 తెలంగాణ ఉద్యమం వరకు ఆయన నిరంతరం పోరాటాలు సాగించారు. విద్యార్థి నాయకుడిగా ఫజల్ అలీ కమిషన్కు నివేదిక సమర్పించడం ద్వారా ఆయన విజ్ఞానాన్ని ప్రదర్శించారు. జయశంకర్ గారి సిద్ధాంతాలే అనంతరం తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి మార్గదర్శకమయ్యాయి.” అని తెలిపారు.
అనంతరం ఆయన 2011 జూన్ 21న గొంతు క్యాన్సర్తో తుదిశ్వాస విడిచిన విషయాన్ని స్మరించుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరు ఘన నివాళులు అర్పించారు.
ఈ జయంతి వేడుకలో అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఇంజనీర్ అసోసియేషన్ నాయకులు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు, కుల సంఘాల నేతలు, అర్టీజన్ కార్మికులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘనమైన నివాళులు అర్పించారు.
Post a Comment