భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు
హైదరాబాద్, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, ముఖ్యమంత్రి ఉదయం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
సీఎం మాట్లాడుతూ, 15 జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని తెలిపారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించామని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి సూచనలు:
- వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలి.
- రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నీటి విడుదలపై ముందుగానే సమాచారం ఇవ్వాలి.
- పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలి.
- రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాలు, లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై రాకపోకలను పూర్తిగా నిషేధించాలి.
- పోలీసులు, రెవెన్యూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలి.
- దోమలు, ఇతర క్రిమికీటకాలు పెరగకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలి.
- వైద్యారోగ్య శాఖ తగినంత మందులు నిల్వ ఉంచి, అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి.
- ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, వైద్యారోగ్య, పురపాలక, పోలీసులు, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సమన్వయంతో పనిచేయాలి.
- హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖలు వెంటనే స్పందించాలి.
Post a Comment