రెసిడెన్షియల్ హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై సర్కార్ సీరియస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్లో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం గంభీరంగా స్పందించింది. విద్యార్థులు అనారోగ్యం పాలవ్వడానికి కారణమైన వారిపై అధికార యంత్రాంగం కఠిన చర్యలు ప్రారంభించింది.
వివరాల ప్రకారం, హాస్టల్లోని వాటర్ ట్యాంక్లో పురుగుల మందు కలిపిన సైన్స్ టీచర్ రాజేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనను హత్యాయత్నంగా పరిగణించి అతనిపై కేసు నమోదు చేశారు.
అంతేకాక, విద్యార్థులను బెదిరించిన మరో ఇద్దరు టీచర్లు సూర్య కిరణ్, వేణు, అలాగే అసిస్టెంట్ కుక్ రాజేశ్వరిపై కూడా విచారణలో సాక్ష్యాధారాలు లభించాయి. నలుగురిపై ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది.
జిల్లా కలెక్టర్ తక్షణమే ఆ నలుగురినీ విధుల నుండి టెర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘటనపై జిల్లా పోలీసు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల సంఘం అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Post a Comment