వంతెనపై కారు బీభత్సం — డివైడర్ ఢీ కొట్టి బోల్తా!
హైదరాబాద్, అక్టోబర్ 26: మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని కెపిహెచ్బీ కాలనీ సమీపంలోని జెఎన్టీయూ వంతెనపై ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఉదయం సుమారు 7:50 గంటల సమయంలో రైతు బజార్ దాటి వంతెనపైకి ఎక్కిన రెడ్ కలర్ కారు, అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తాపడింది.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ కారులో సూడాన్కు చెందిన ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే వారు ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఘటనాస్థలం నుండి పారిపోయినట్లు చెబుతున్నారు.
కారు అద్దెకు తీసుకున్నదా లేదా ఎవరైనా ఇచ్చిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సూడాన్ పౌరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Post a Comment