సుడిగాలుల బీభత్సం లెంకలగడ్డ అటవీప్రాంతంలో భారీ ఈదురు గాలులు — చెట్లు విరిగిపడి అల్లకల్లోలం
స్థానికుల వివరాల ప్రకారం, సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, గాలి వేగం గంటకు 60–70 కి.మీ. వేగంతో వీచింది. క్షణాల్లోనే చెట్లు విరిగిపడి రహదారిపై పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలోని పొలాల్లో నిల్వ చేసిన పంట దిబ్బలు గాలికి ఎగిరిపోయాయి. పలు రైతుల పొలాల్లో పంటలు కూలిపోవడంతో నష్టం వాటిల్లినట్లు సమాచారం.
అటవీశాఖ అధికారులు, గ్రామస్థులు కలిసి చెట్లు తొలగించే పనులు చేపట్టారు. సుడిగాలుల కారణంగా విద్యుత్ సరఫరా కూడా కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. గ్రామంలో పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా, కొన్ని చోట్ల చిన్న స్థాయి గోడలు కూలిపోయాయి. అదృష్టవశాత్తూ పెద్ద ప్రాణనష్టం జరగలేదు.
స్థానిక ప్రజలు ఈ సుడిగాలులను గత కొన్నేళ్లలో చూడలేదని చెబుతున్నారు. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుల కారణంగా ఈ పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు నష్టాల వివరాలను సేకరిస్తూ, బాధిత రైతులకు సహాయం అందించే దిశగా చర్యలు చేపడుతున్నారు.

Post a Comment