కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపులకు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కొత్తగూడెం, నవంబర్ 5 : కొత్తగూడెం ఎక్సైజ్స్టేషన్లో తీవ్ర కలకలం రేపిన సంఘటన చోటుచేసుకుంది. సీఐ నిరంతర వేధింపులకు గురై ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనతో ఎక్సైజ్శాఖలో ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం ప్రకారం — సదరు మహిళా కానిస్టేబుల్ సీఐ ప్రవర్తనను తట్టుకోలేకపోయి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు సమయానికి గమనించి ఆమెను సమీప ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని సమాచారం.
ఈ సంఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు ఎక్సైజ్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా ఇతర మహిళా, పురుష కానిస్టేబుళ్లు, ఒక ఎస్ఐ కూడా నిరసనలో పాల్గొన్నారు.
అయితే, ఈ ఘటనను ఎక్సైజ్ సీఐ “డ్రామా”గా కొట్టిపారేయడం మరింత వివాదానికి దారితీసింది. తనపై ఆరోపణలు చేయడం ఆపకపోతే, “వారి పేర్లు రాసి తానే ఆత్మహత్య చేసుకుంటానని” సీఐ బెదిరించినట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు.
గతంలో కూడా ఇదే సీఐ వేధింపులు తట్టుకోలేక ఒక ఎస్ఐ ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో స్టేషన్లో సిబ్బంది మధ్య తగాదాలు పెరగడంతో, పలు ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కలిసి ఎక్సైజ్ సూపరింటెండెంట్కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిసింది.
ఈ ఘటనపై సూపరింటెండెంట్ స్పందిస్తూ — “విషయాన్ని సీరియస్గా తీసుకుంటాం. సమగ్ర విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాం” అని తెలిపారు.

Post a Comment