సౌదీ బస్సు ప్రమాదం బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం మంత్రివర్గ నిర్ణయం
హైదరాబాద్, నవంబర్ 17: సౌదీ అరేబియాలో మక్కా–మదీనా మార్గంలో జరిగిన దుర్ఘటనలో మరణించిన తెలంగాణకు చెందిన యాత్రికుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రతి బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రభుత్వం తెలుపింది.
కేబినెట్ సమావేశంలో ఈ సంఘటనపై నివేదికను సమీక్షించిన అనంతరం, కుటుంబాల పట్ల ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని నిర్ణయించింది.
సౌదీకి ప్రత్యేక ప్రభుత్వ బృందం
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని వెంటనే సౌదీ అరేబియాకు పంపనుంది. మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఎంఐఎం ఎమ్మెల్యే మరియు మైనారిటీ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి ఈ బృందంలో భాగమవుతారు. బాధితుల వివరాల సేకరణ, మృతదేహాలకు సంబంధించిన ప్రక్రియలు, కుటుంబాలకు అవసరమైన సహకారం వంటి అంశాలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది.
అక్కడిక్కడే అంత్యక్రియలు కుటుంబ సభ్యులకు ఏర్పాట్లు
కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం, మృతుల కుటుంబ సభ్యుల అభిమతం మేరకు మత సంప్రదాయాలకు అనుగుణంగా సౌదీ అరేబియాలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి కుటుంబం నుంచి ఇద్దరు సభ్యులను సౌదీ అరేబియాకు పంపడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణం, వీసా, స్థానిక ఏర్పాట్లు అన్నీ ప్రభుత్వం భరించనుంది.
సౌదీ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి అర్పిస్తూ, వారి కుటుంబాలకు ఆపన్నహస్తం అందించడానికి ప్రభుత్వం వేగవంతమైన చర్యలు ప్రారంభించినట్లు మంత్రివర్గం వెల్లడించింది.

Post a Comment