-->

ఓ వ్యక్తి హత్య ఉద్రిక్తతకు దారితీసిన హత్య 24 గంటల్లో పోలీసులు కేసు ఛేదన

ఓ వ్యక్తి హత్య ఉద్రిక్తతకు దారితీసిన హత్య 24 గంటల్లో పోలీసులు కేసు ఛేదన


మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో కలకలం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యతండాలో ఈ నెల 22న జరిగిన ఓ వ్యక్తి హత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తండాకు చెందిన భూక్యా వీరన్న (45) మంగళవారం రోడ్డుపై మృతి చెంది కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా బుధవారం పోలీసులు మృతుడి ఇంటికి చేరుకోగా, విషయం తెలుసుకున్న తండావాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వీరన్న హత్యలో అతడి భార్య విజయ హస్తం ఉందన్న అనుమానంతో ఆమెపై దాడికి యత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన గుంపు పోలీసులపై రాళ్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఎస్సైతో పాటు ఓ కానిస్టేబుల్‌కు గాయాలు కావడంతో వారిని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

బాలాజీ ఇంటిపై దాడి యత్నం

వీరన్న భార్య విజయకు అదే తండాకు చెందిన బోడ బాలాజీతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు బాలాజీ కారణమన్న అనుమానంతో అతడి ఇంటిపై దాడికి తండావాసులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా, బాలాజీకి సహకరించాడని ఆరోపణలతో ఆర్‌ఎంపీ ధర్మారపు భరత్ నిర్వహిస్తున్న క్లినిక్‌ను ధ్వంసం చేసి, అతడి ద్విచక్ర వాహనాన్ని దహనం చేశారు.

లోన్ మాఫీ కోసమే హత్య ప్లాన్

ఈ ఘటనపై డీఎస్పీ తిరుపతిరావు మానుకోటలోని తన కార్యాలయంలో కీలక వివరాలు వెల్లడించారు. వీరన్న పేరుపై ఓ ప్రైవేట్ సంస్థలో తీసుకున్న లోన్‌ను మాఫీ చేయించుకోవడానికే విజయ ఈ హత్యకు కుట్ర పన్నిందని తెలిపారు. లోన్ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందితే రుణం మాఫీ అవుతుందన్న విషయం తెలుసుకున్న విజయ, తన ప్రియుడు బాలాజీతో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.

పామాయిల్ తోటలో హత్య

ప్లాన్ ప్రకారం ఈ నెల 22న రాత్రి బాలాజీ, ఆర్‌ఎంపీలు కలిసి వీరన్నను ఊరి బయట ఉన్న పామాయిల్ తోటకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగిన అనంతరం బాలాజీ ఇనుప రాడ్‌తో వీరన్న తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బైక్‌తో కలిసి రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.

24 గంటల్లో కేసు ఛేదన

మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్‌ నేతృత్వంలో పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి 24 గంటల్లోనే కేసును ఛేదించారు. ఈ హత్యకు సంబంధించి భార్య విజయ, ప్రియుడు బాలాజీతో పాటు ఆర్‌ఎంపీ భరత్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793