పెద్దపల్లి చెక్ డ్యాంల ధ్వంసం ఘటనపై మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం
పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యాంలు ధ్వంసమైన ఘటనపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీసిన ఆయన, వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
చెక్ డ్యాంల నిర్మాణంలో నాసిరక పనులు లేదా నాణ్యత లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. అదే విధంగా కావాలనే చెక్ డ్యాంలను ధ్వంసం చేసినట్లు నిర్ధారణ అయితే, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విచారణను వేగవంతం చేసి బాధ్యులను వెంటనే గుర్తించాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. రైతులకు మేలు చేసే చెక్ డ్యాంలను ధ్వంసం చేయాలని ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టంగా చెప్పారు.
అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెక్ డ్యాంల భద్రతపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.

Post a Comment