రేపు తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధం! ఎన్నికల నిర్వహణకు నిధుల కేటాయింపు
హైదరాబాద్ : డిసెంబర్ 10: తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడువిడతలుగా జరగనున్న గ్రామీణ స్థానిక స్వయంప్రభుత్వ ఎన్నికల్లో భాగంగా డిసెంబర్ 11, గురువారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొలి విడత పోలింగ్ జరగనుంది. దీనికి అవసరమైన మొత్తము సామగ్రి, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది.
పోలింగ్ బృందాల తరలింపు పూర్తిస్థాయిలో
మంగళవారం సాయంత్రంతో తొలి విడత ప్రచారం ముగిసింది. వెంటనే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే మండల కేంద్రాలకు పంపిన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని బుధవారం గ్రామాల పోలింగ్ స్టేషన్లకు తరలించనున్నారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన అధికారులు అక్కడ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నారు.
వెబ్కాస్టింగ్తో పర్యవేక్షణ
మొత్తం మూడు విడతల్లో 10 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడతలో 3 వేలకుపైగా కేంద్రాల్లో లైవ్ పర్యవేక్షణ ఉంటుంది. సంబంధిత కేంద్రాల్లో సాంకేతిక ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తక్షణ కౌంటింగ్ – ఈసీ స్పష్టం
పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు.
- ముందుగా సర్పంచ్, వార్డు మెంబర్ల ఫలితాలు ప్రకటించాలి.
- అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక చేపట్టాలి.ఈసారి గ్రీన్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది.
ఎన్నికల నిర్వహణకు నిధుల కేటాయింపు
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రేవంత్ ప్రభుత్వము మొత్తం రూ.175 కోట్లు కేటాయించింది. ఇందులో
- రూ.100 కోట్లు ఇప్పటికే జిల్లావారి ఎన్నికల అధికారుల ఖాతాల్లో జమ
- పోలింగ్ కేంద్రాల వారీగా ఎంపీడీవో ఖాతాల్లో కూడా నిధుల పంపిణీ
మిగిలిన రూ.75 కోట్లు త్వరలో విడుదల కానున్నాయి. అయితే ఎన్నికల నిర్వహణకు ఈ నిధులు సరిపోనని, అదనంగా రూ.50 కోట్లు కావాలంటూ పంచాయతీ రాజ్ శాఖ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
ప్రచండ పోటీ – తొలి విడత గణాంకాలు
- తొలి విడతలో మొత్తం 37,440 వార్డులకు నోటిఫికేషన్
- 149 వార్డుల్లో నామినేషన్లు లేకపోవడం
- 9,331 వార్డులు ఏకగ్రీవం – రికార్డు స్థాయిలో
- మిగిలిన 27,960 వార్డులకు పోలింగ్
- మొత్తం 67,893 మంది అభ్యర్థులు బరిలో
రేపటి పోలింగ్ శాంతియుతంగా, పారదర్శకంగా సాగేందుకు పోలీసులు సహా అన్ని విభాగాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

Post a Comment