వర్గంటి రామ్మోహన్ గౌడ్ను పరామర్శించిన బండారు దత్తాత్రేయ
మెదక్, తూప్రాన్ | డిసెంబర్ 26: బీజేపీ మెదక్ పార్లమెంటరీ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్ నివాసాన్ని హర్యానా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఇరువురు నేతలు పలు రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతం, బీసీ వర్గాల రాజకీయ పాత్ర, రాబోయే రాజకీయ పరిణామాలపై కీలక అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. ముఖ్యంగా బీసీ వర్గాలను పార్టీతో మరింత బలంగా అనుసంధానం చేయాల్సిన అవసరంపై ఇద్దరూ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బండారు దత్తాత్రేయకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ భేటీతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని బీజేపీ నేతలు తెలిపారు.

Post a Comment