కోపోద్రిక్తురాలైన తల్లి చేతిలో కుమార్తె హత్య
ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తన కుమార్తె ప్రేమ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా చూసిన తల్లి, ఆగ్రహావేశంలో కుమార్తెనే హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గ్రామానికి చెందిన జంగమ్మకు భార్గవి అనే కుమార్తె ఉంది. ఇటీవల భార్గవికి వరుసకు మేనబావతో వివాహం కుదిరింది. అయితే ఆమె అప్పటికే మరో యువకుడితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా భార్గవి జాగ్రత్త పడుతూ వచ్చింది.
ఈ క్రమంలో తల్లి జంగమ్మ పొలం పనులకు వెళ్లిన సమయంలో, భార్గవి తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని మాట్లాడుతోంది. అదే సమయంలో పొలం నుంచి తిరిగివచ్చిన జంగమ్మ ఈ దృశ్యాలను గమనించింది. దీంతో ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
తీవ్ర కోపోద్రిక్తురాలైన జంగమ్మ, కుమార్తెను తీవ్రంగా కొట్టి ఇంట్లోకి తీసుకెళ్లింది. అనంతరం ఆగ్రహావేశంలో చీరతో ఉరేసి కుమార్తెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపగా, తల్లి చేతిలోనే కుమార్తె ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment