మెట్రో పిల్లర్ను ఢీకొట్టిన కారు… ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
హైదరాబాద్ | మేడిపల్లి హైదరాబాద్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందగా, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు మెట్రో పిల్లర్ నంబర్–97ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు. ఢీకొన్న తీవ్రతకు సాయి వరుణ్, నిఖిల్ అనే విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకట్, రాకేష్, యశ్వంత్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇదే ఘటనలో సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన వారంతా వనపర్తి జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, అతి వేగమే ప్రమాదానికి కారణమా? ఇతర సాంకేతిక లోపాలేమైనా ఉన్నాయా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment