కృష్ణా–గోదావరి జలాలపై తెలంగాణ హక్కుల్లో రాజీ లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 1: కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడబోమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీటి హక్కులను పరిరక్షించడంలో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ, ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందని తెలిపారు.
జ్యోతీరావు పూలె ప్రజాభవన్లో కృష్ణా–గోదావరి నదీ జలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
గత తప్పిదాల సవరణకు ప్రభుత్వం నిబద్ధత
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కృష్ణా, గోదావరి బేసిన్లలో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం క్రమశిక్షణతో, నిబద్ధతతో చర్యలు తీసుకుంటోందన్నారు. నదీ జలాలపై సమగ్ర సమాచారాన్ని శాసనసభ ముందు ఉంచుతామని, ఈ అంశంలో రాజకీయ లబ్ధి కోసం కాదు, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
కృష్ణా జలాల కేటాయింపులో అన్యాయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు కేటాయించగా, రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని అప్పటి ప్రభుత్వం అంగీకరించిందని సీఎం గుర్తుచేశారు. అంతర్జాతీయ నదీ జల ఒప్పందాల ప్రకారం నది పరీవాహక ప్రాంతం ఆధారంగా తెలంగాణకు 71 శాతం, ఏపీకి 29 శాతం జలాలు రావాల్సి ఉండగా, గత పాలకులు భిన్నంగా ఏపీకి 66 శాతం, తెలంగాణకు కేవలం 34 శాతం జలాలకు అంగీకరించారని విమర్శించారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై తీవ్ర వ్యాఖ్యలు
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి ఎత్తిపోతల పాయింటును జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్కు మార్చడం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 13 టీఎంసీలు తరలిస్తుంటే, తెలంగాణ కేవలం 2.5 టీఎంసీలకే పరిమితమైందని తెలిపారు. ప్రాజెక్టు మార్పుతో లిఫ్టులు, పంపులు పెరిగినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కనీసం 2.5 టీఎంసీలు తరలించే మౌలిక సదుపాయాలు కూడా తెలంగాణకు లేవని చెప్పారు.
డీపీఆర్ లేకుండానే వేల కోట్లు ఖర్చు
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏడేళ్ల పాటు అసలు డీపీఆర్ సమర్పించకుండానే సుమారు రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని సీఎం వెల్లడించారు. డీపీఆర్ లేకపోవడంతో పర్యావరణ అనుమతులు రాలేదని, అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో న్యాయస్థానాల్లో కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.
దాంతో గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టు కాదని, 7.15 టీఎంసీల సామర్థ్యంతో తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్నామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించిందని తెలిపారు.
శాసనసభలో సమగ్ర చర్చ
కృష్ణా, గోదావరి జలాలపై కొన్ని అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం పేర్కొన్నారు. అందుకే ఈ కీలక అంశాలపై శాసనసభ ముందు సమగ్ర వివరాలు ఉంచుతామని, చర్చలో సభ్యులందరూ పాల్గొని రాష్ట్ర హక్కుల పరిరక్షణకు సహకరించాలని ఆయన కోరారు.

Post a Comment